మా తెలుగు తల్లి గేయంలో లిరిక్స్ మార్చాల్సిన దుస్థితి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన!

  • గోదావరి నది కాలుష్య పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన పవన్
  • పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికి కూపాలుగా మారుతున్నాయని ఆవేదన
  • గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన

రాజమండ్రిలో గోదావరి నది కాలుష్య పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నదుల ప్రస్తుత దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మన సంస్కృతిలో భాగమైన 'మా తెలుగు తల్లి' గేయంలో.. గోదావరి, కృష్ణమ్మల 'గలగల'లు అని ఎంతో గర్వంగా పాడుకుంటాం. కానీ, నేడు పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికికూపాలుగా మారుతున్న తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో గోదావరి, కృష్ణమ్మ 'వెలవెల' అని పాడుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ, ఇటు సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


పరిశ్రమల నుంచి వెలువడుతున్న విష వ్యర్థాలు నేరుగా పవిత్ర గోదావరి నదిలో కలవడం పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నదిలోని కలుషిత నీటి నమూనాలను (శాంపిల్స్) తక్షణమే సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదికలు చేతికి వచ్చిన వెంటనే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన ఫ్యాక్టరీలపై కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నదులను కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.


దశాబ్దాలుగా నగరానికి శాపంగా మారిన ఈ కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పవన్ తెలిపారు. ఇందులో భాగంగానే గోదావరి కాలుష్య నివారణ కోసం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం అధికారికంగా ప్రకటించారు. ఈ టాస్క్‌ఫోర్స్ నదిలోకి వ్యర్థాల విడుదలను నిరంతరం పర్యవేక్షిస్తుందని, కాలుష్య నియంత్రణ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా పారిశ్రామికవేత్తలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.


Pawan Kalyan
Godavari River
Krishna River
River Pollution
Andhra Pradesh
Deputy CM
Environmental Protection
Water Pollution
Task Force
Telugu Talli Poem

More Telugu News